రామాయణం విషవృక్షం తెలుగు పౌరాణిక కథల మీద రంగనాయకమ్మ చేసినన్ని విమర్శలు ఇంకెవరూ చేయలేదేమో. వేరే వాళ్ళు చేసినా కానీ రంగనాయకమ్మ విమర్శలని ఆకట్టుకున్నన్ని వివాదాలు ఇంకెవరి విమర్శలు ఆకట్టుకోలేదు. వేదాలు, మహాభారతం పై ఆమె చేసిన విమర్శ చాలా సూటిగా ఉంటుంది. రామాయణం విషయం లోనూ అదే పంథా ఆమెది. 'రామాయణం విషవృక్షం' అనే పేరు తోనే ఆమె ఈ పుస్తకం లో ఏం చెప్పదలచుకున్నారు అనే విషయం చెప్పకనే చెప్పారు. ఆమె దృష్టిలో 'రామాయణం' ప్రచారం చేసే విలువలూ, సంస్కృతీ ఈ నాటికీ నిత్య జీవితాల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి కానీ అవి సరైనవి కాదు అంటారావిడ. అదే విషయాన్ని చాలా ఘాటుగా చెప్పే ప్రయత్నమే చేశారు ఈ పుస్తకం లో. రామాయణ పుట్టుపూర్వోత్తరాల్నీ, దాన్ని నిత్యం ప్రచారం చేసే వ్యవస్థ నిజ స్వరూపాన్నీ ఆవిడ తనదైన శైలి లో విమర్శ చేశారు ఈ 'రామాయణం విషవృక్షం' లో.